- అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన రంగనాథ స్వామి..
- వారంలో ఒక్కరోజు మాత్రమే తెరచి వుండే ఆలయం..
శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథ స్వామిగా కొలువై ఉన్న ఆలయాలు దక్షిణ భారతంలోనే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ద్రావిడ సంప్రదాయాన్ని పాటించే తమిళనాడులో రంగనాథ స్వామి ఆలయాలు అధికంగా చూడవచ్చు. అయితే ఈ ఆలయాల్లో చాలావరకు స్వయంభువు ఆలయాలుగా ఉండడం విశేషం. ఈ క్రమంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన రంగనాథ స్వామి ఆలయం చాల విశిష్టమైంది.
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ స్వయంభువుగా వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి దర్శనం వారానికోసారి అదీ శనివారం మాత్రమే! వారంలో ఒక్క శనివారం మాత్రమే తెరచి ఉంచే నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం మార్కాపురం జిల్లా రాచర్ల మండలం. జె.పుల్లలచెరువు గ్రామంలో నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలో వెలసి ఉంది. లక్ష్మీదేవి శిలగా మారిపోయిన ఈ ఆలయ స్థల పురాణం చూద్దాం. పూర్వం నెమలి శిరస్సుతో ఉన్న మయూర మహర్షి అనే ఋషి నల్లమల అటవీ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయసాగాడు. మహర్షి తన తపోదీక్షలోనే తన ముక్కుతో ఒక గుండాన్ని తవ్వాడంట! నెమలి శిరస్సుతో ఉన్న మహర్షి నిర్మించిన గుండం కాబట్టి ఈ గుండానికి నెమలిగుండం అనే పేరు వచ్చింది.
నెమలి గుండం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుకగుండం దగ్గర చెంచు జాతికి చెందిన బయ్యన్న, బయ్యక్క అనే దంపతులు నివసించేవారు. వారికి రంగలక్ష్మి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె చిన్ననాటి నుంచి శ్రీ మహా విష్ణువుని తన భర్తగా భావించే మానవమాత్రులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించబోతే ఆమె అక్కడ నుంచి నెమలిగుండం దగ్గర తపస్సు చేసుకుంటున్న మయూర మహర్షి వద్దకు వచ్చి తన మనసులోని మాటను విన్నవించుకుందంట! మహర్షి సూచన మేరకు రంగలక్ష్మి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేయసాగింది.
కొంతకాలానికి ఆమె తపస్సు ఫలించి శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై రంగలక్ష్మిని అనుగ్రహించి ఆమెను పరిణయమాడి తనలో ఐక్యం చేసుకున్నాడు. అలా ఆ ప్రాంతంలో మయూర మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు రంగనాథుడిగా స్వయంభువుగా అవతరించాడు. అనంతర కాలంలో మహర్షి శ్రీరంగనాథునికి ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీ మహా విష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి రావడంతో స్వామిని వెతుకుతూ లక్ష్మీదేవి కూడా భూలోకానికి వచ్చి స్వామికి రంగలక్ష్మితో వివాహం జరిగిన సంగతి తెలుసుకుని కన్నీరు కారుస్తూ శిలగా మారిపోయిందంట! ఇందుకు నిదర్శనంగా అమ్మవారి శిల నుంచి బొట్టుబొట్టుగా నీరు ప్రవహిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు.
