- ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం..
- ప్రసాదంలో కొంత భాగం బలిపీఠం వద్ద ఉంచుతారు..
హిందూ ధర్మంలో పూజలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. పూజల్లో ఎన్నో రకాలు ఉంటాయి. భగవంతుడు తమను కాపాడాలని, సుఖసౌఖ్యాలను అందించాలని జనం మొక్కుతారు. ఇందుకోసం పలు రకాల పూజలు చేస్తారు. అయితే, మీకు భూత బలి గురించి తెలుసా? దాన్ని ఎలా నిర్వహిస్తారు? పద్ధతి ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ప్రతీ వైష్ణవ, శైవ ఆలయాల్లోనూ గర్భగుడికి ఎదురుగా, ధ్వజస్తంభానికి అత్యంత సమీపంలో ‘బలిపీఠం’ తప్పనిసరిగా దర్శనమిస్తుంది. దీనిని కేవలం ఒక రాతి కట్టడంగా కాకుండా, ఆలయ రక్షణకు, సమస్త జీవుల తృప్తికి ప్రతీకగా భావిస్తారు.
ఆలయంలోని మూలవిరాట్టుకు నిత్యం షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నైవేద్యం కూడా సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదంలోని కొంత భాగాన్ని ఈ బలిపీఠం మీద ఉంచుతారు. దీన్నే శాస్త్రం ప్రకారం “భూతబలి” లేదా “బలిహరణం” అంటారు. ఇక్కడ “బలి” అంటే ప్రాణాలు తీయడం కాదు, సమర్పించడం లేదా త్యాగం అని అర్థం.
లోకంలోని సమస్త ప్రాణికోటి ఆకలి తీరాలని, ఈ విశ్వం శాంతితో సౌఖ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ సమర్పించే అన్నమే ఈ భూతబలి! ఇది అనాదిగా వస్తున్న ఆచారం. దీని వెనుక విశ్వజనీనమైన ప్రేమ సందేశం దాగి ఉందని చెబుతారు. ఈ బలి అన్నాన్ని ఆలయ పరిసరాల్లో ఉండే పక్షులు, కీటకాలు ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే, మనిషితోపాటు సృష్టిలోని ప్రతీ చిన్న జీవికి కూడా జీవించే హక్కు ఉందనే ఉన్నతమైన భావనను ఈ సాంప్రదాయం ప్రతిబింబిస్తుందని చెబుతారు.
