- సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు..!
ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రికే నిర్లక్ష్య జ్వరం పట్టుకుంది. మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ బుధవారం ఉదయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. 10 గంటలు దాటినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు, టీకాల కోసం చిన్నారులను తీసుకొచ్చిన బాలింతలు గంటల తరబడి ఆస్పత్రి ఎదుటే పడిగాపులు కాశారు.

బుధవారం కావడంతో చిన్నారులకు వ్యాక్సినేషన్ కోసం ఒకరి వెంట ఒకరు తల్లులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది జాడ లేకపోవడంతో చంటి బిడ్డలను ఎత్తుకుని మహిళలు అవస్థలు పడ్డారు.“ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇలానే ఉంటే పేదలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ప్రజలు మండిపడ్డారు. గంటకు పైగా రోగులు, వైద్య సిబ్బంది ఎదురు చూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.సమయపాలన పాటించని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
