- ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి..
మట్టి కుండలో నిల్వ చేసే నీరు, సాధారణంగా మట్కా వాటర్ గా పిలవబడే ఈ సంప్రదాయ పద్ధతిని, వేసవి కాలంలో చాలా మంది ఉపయోగిస్తారు. విద్యుత్ అవసరం లేకుండా సహజంగా నీటిని చల్లగా ఉంచే ఈ విధానం ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే మట్టికుండల నాణ్యత, శుభ్రత, నిల్వ విధానాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మట్కాలో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లబడుతుంది.
మట్టికుండల రంధ్రాల వల్ల నీరు స్వల్పంగా ఆవిరైపోతూ, లోపల ఉన్న నీటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఫ్రిజ్లో ఉంచిన నీటితో పోలిస్తే ఇది గొంతుకు మృదువుగా ఉంటుంది. ఆకస్మికంగా చల్లని నీరు తాగడం వల్ల కలిగే టెంపరేచర్ షాక్ సమస్యలను మట్కా నీరు నివారిస్తుంది. మట్కా నీరు శరీరంలోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మట్టికుండలలో ఉండే క్షార గుణాలు నీటిలోని ఆమ్లత్వాన్ని తగ్గించి, వేసవిలో తరచుగా ఎదురయ్యే ఆమ్లత్వ సమస్యలను తగ్గిస్తాయి.
దీని వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి, గట్ (జీర్ణ వ్యవస్థ) హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ, మెటబాలిజం మెరుగుపడటంలో కూడా మట్కా నీరు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మట్టిలో సహజంగా ఉండే ఖనిజాలు శరీరానికి ఉపయోగకరంగా పనిచేస్తాయి. అయితే మట్టికుండను సక్రమంగా శుభ్రపరచకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ నీటితో పోలిస్తే మట్కా నీరు గొంతుకు, శ్వాసకోశానికి హితంగా ఉంటుంది.
వేసవిలో చల్లని నీరు తాగడం వల్ల వచ్చే దగ్గు, జలుబు సమస్యలను ఇది తగ్గిస్తుంది. అయితే నీటిని కప్పుతో మూసి ఉంచడం, శుభ్రత పాటించడం తప్పనిసరి. కాలుష్యం అనుమానం ఉన్నప్పుడు ఆ నీటిని వాడకూడదు. మట్కా నీరు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. మట్టిలోని సహజ గుణాల వల్ల నీటికి స్వల్ప భూమి వాసన, రుచులు చేరతాయి. సాధారణంగా ఈ నీటి ఉష్ణోగ్రత 10 నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసే నీటితో పోలిస్తే మట్కా నీరు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
