- అయితే ఖచ్చితంగా మీరిది చదవాల్సిందే..
- కొన్ని రకాల హార్మోన్స్ విడుదల కావడం దీనికి కారణం..
కొంతమందికి భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తుంది. శరీరం శక్తి హీనమై కునుకు తీయకుండా కనీసం కూర్చునే ఓపిక కూడా ఉండదు. దీనినే ఫుడ్ కోమా అని అంటారు. కడుపు నిండా అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఇలా జరుగుతుంది. ఎక్కువ మందికి మధ్యాహ్నం వేళ ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ తిన్న తర్వాత శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవడం, కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని.. అందుకే ఆ జీర్ణ ప్రక్రియ కొనసాగుతున్నంత సేపూ శరీరంలో శక్తి తగ్గుతుందని.. ఫలితంగా నీరసం, అలసట ఆవహించి శరీరం విశ్రాంతిని కోరుకుంటుందని.. అందుకే మగతగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకున్న ఆహారంలో పీచు, ప్రొటీన్ వంటి పోషకాలు తక్కువగా ఉంటే ఈ నిద్ర మత్తు ఇంకా ఎక్కువగా అనిపిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆహారంలో ఫైబర్, ప్రొటీన్ తక్కువగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయట. ఫలితంగా నిద్ర మత్తు ముందుకొస్తుందట.
అంతేకాదు తిన్న తర్వాత మెదడులో అమైనో ఆమ్లాలు విడుదలవుతాయట. అవి నిద్రకు కారణమయ్యే సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయట. దాంతో మన శరీరం పారాసింపథెటిక్ వ్యవస్థలోకి వెళ్తుందట. అందుకే తిన్న వెంటనే పడుకుంటే బాగుండు అనిపిస్తుందట. ఇలా జరగడంవల్ల మనం చేసే పనులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఇలా జరగకూడదంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు సలాడ్లు, సూప్స్ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల అరుగుదల సాఫీగా జరుగుతుందని అంటున్నారు.
