- వేధింపుల నేపథ్యంలో హత్య అనుమానం
జవహర్ నగర్ పరిధిలో మహిళ మృతి ఘటన సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలతో కేసు మరింత తీవ్రత సంతరించుకుంది. దేవేందర్ నగర్కు చెందిన దాసరి యెల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం, అతని మూడో చెల్లెలు ద్యావేరంగుల విజయ (35) ప్రతిరోజూ దమ్మాయిగూడ కూలీ అడ్డాకు వెళ్లి పని చేసేది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తేదీ 25 మార్చి మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ, మేసన్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుని రాత్రి 8 గంటల లోపల తిరిగి వస్తానని పిల్లలకు చెప్పింది.
అయితే ఆ రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి బంధువుకు ఫోన్ కాల్ వచ్చి, దమ్మాయిగూడలో మణిషా వైన్స్ వెనుక పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, అది విజయ మృతదేహమని గుర్తించారు. మృతదేహంపై గాయాలు, రక్తస్రావం ఉండటంతో హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదుదారు ప్రకారం, యశోద, బాలస్వామి అనే వ్యక్తులు తరచూ విజయతో గొడవపడుతూ, ఆమెను వేధించడంతో పాటు డబ్బులు తీసుకునేవారని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల రోజుల్లో బాలస్వామి వేధింపులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలస్వామి చేత హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తూ, బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
