Tuesday, March 17, 2026
Homeఆదిలాబాద్Inspection | సారంగాపూర్ గ్యాస్ గోదాంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Inspection | సారంగాపూర్ గ్యాస్ గోదాంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు – ప్రజలు ఆందోళన చెందవద్దు

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరాలో జరుగుతున్న జాప్యం, గోదాం నిర్వహణలో భద్రతా ప్రమాణాల లోపాలపై ఆమె ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వినియోగదారులతో కలెక్టర్ మాట్లాడుతూ, సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత వినియోగదారులు ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదని, నిర్ణిత గడువులోగా సిలిండర్లు గ్రామాలకు డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం జరిగితే లేదా వినియోగదారులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, యథావిధిగా సరఫరా జరుగుతుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించడం, కృత్రిమ కొరత సృష్టించడం లేదా బ్లాక్‌లో విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం గోదాం లోపల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్న ప్రదేశంలో అవసరమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

తక్షణమే తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జిల్లాలోని గ్యాస్ గోదాములను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలపై సమగ్ర చెక్‌లిస్ట్ రూపొందించాలని ఆదేశించారు. ఫైర్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చట్టప్రకారం భారీ జరిమానాలు విధించాలని సూచించారు. గ్యాస్ గోదాముల నిర్వహణ, భద్రతా చర్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని హెచ్చరించారు.

ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News