- ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
- వేతనాలు పెంచాలి,పని వత్తిడి తగ్గించాలి – ఆశా వర్కర్ల వినతి
- బస్తీలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తల సేవలు కీలకం
ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పై వత్తిడి తీసుకువస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు.తుకారంగేటు అర్బన్ హెల్త్ సెంటర్కు చెందిన ఆశా వర్కర్లు బుధవారం సితఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా వారు వివిధ సమస్యలపై వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ…
ప్రస్తుతం తాము తక్కువ వేతనాలతో ఎక్కువ పని భారం మోయాల్సి వస్తోందని తెలిపారు.ప్రభుత్వం విధిస్తున్న వివిధ టార్గెట్ల కారణంగా రోజువారీ పనులు మరింత కష్టంగా మారుతున్నాయని పేర్కొన్నారు.తమకు సరైన వేతనాలు పెంచాలని,పని వత్తిడిని తగ్గించాలని, అవసరానికి మించి విధిస్తున్న టార్గెట్లను తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గ్రామాలు,బస్తీలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
వారి సమస్యలు పరిష్కారమవ్వడం అవసరమని పేర్కొన్నారు.ఆశా కార్యకర్తల డిమాండ్లను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో తుకారంగేటు అర్బన్ హెల్త్ సెంటర్కు చెందిన ఆశా కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
