‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. రెండేండ్లు పనితీరు సక్రమంగా లేని ప్రైవేటు కళాశాలలకు ఆ పథకాన్ని ఉపసంహరించాలి’ ఇదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలోని మరో కీలక అంశం. ఇది క్రమక్రమంగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఉపసంహరించాలనే ఎత్తుగడలో భాగమేనని విద్యావేత్తలు, బడుగు, బలహీన వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.
అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉపసంహరించిన కళాశాలల్లో చేరిన విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్కే చెందిన వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ ఆ పథకానికి ఉరితాడును బిగిస్తున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ అథారిటీ కళాశాలల ప్రమాణాలను అంచనా వేస్తుంది. ప్రమాణాలు తక్కువగా ఉంటే, ఆయా కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఉపసంహరించాలని కమిషన్ తన నివేదికలో సూచించింది..
