బంజారాల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు జవహర్ నగర్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అంగోత్ రవి నాయక్ పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు, హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడని చెప్పారు.
చిన్ననాటి నుంచే జగదాంబ భక్తుడిగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ గోవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని, గుత్తి ప్రాంతంలో కరువు రావడంతో కర్ణాటకలోని బళ్లారి వైపు వలస వెళ్లినట్లు చరిత్రలో చెప్పుకుంటారని వివరించారు. బంజారా జాతిని ఆపదల నుంచి రక్షించేందుకు పాటించాల్సిన ఆచారాలు, పూజించాల్సిన దేవతల గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేశాడని తెలిపారు.

బంజారా సమాజం ఏకతాటిపైకి రావాలని, శాకాహారాన్ని అలవాటు చేసుకోవాలని, మాంసాహారం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితోపదేశం చేశాడన్నారు. తోటి మనుషులను గౌరవించాలి, ప్రేమించాలి అనే సందేశాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేవారని గుర్తు చేశారు.
అనంతరం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డీజే ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సలహాదారులు, పెద్ద సంఖ్యలో బంజారా ప్రజలు పాల్గొన్నారు.
