- ఎల్బీ నగర్ బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ షఫీ విమర్శ
- పాలన చేతకాక ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆగ్రహం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కి సిట్ నోటీసులపై స్పందన
రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని ఎల్.బీ.నగర్ బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్(L.B.Nagar BRSV President) షఫీ(Shafi) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి సిట్ నోటీసులు ఇవ్వటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.
మొన్న నైనీ బొగ్గు గనుల కుంభకోణం గురించి బయటపెట్టగానే మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందని, బొగ్గు కుంభకోణం ఆధారాలను బయటపెట్టిగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సిట్ నోటీసులు జారీ చేసిందని అన్నారు. బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం లోక్ భవన్కు వెళ్లి గవర్నర్కి వినతిపత్రం ఇస్తామని చెప్పగానే ఈ రోజు సంతోష్ కుమార్కి నోటీసులు ఇచ్చారని చెప్పారు.
ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే కేవలం బొగ్గు కుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికి సిట్ను రేవంత్ రెడ్డి పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సంతోష్ కుమార్కి సంబంధం లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం విచారకరమని పేర్కొన్నారు. తమకు కోర్టులపై పూర్తి విశ్వాసం ఉందని, ఇలాంటి నోటీసులకు, కేసులకు, బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడరని చెప్పారు. దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటామని షఫీ తేల్చిచెప్పారు.
