భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి హైదరాబాద్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ గబ్బిలాల పేటలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జవహర్ నగర్ బిజెపి నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గబ్బిలాల పేట ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మురికి కాలువలతో ఈ ప్రాంతం పూర్తిగా నిండిపోయి ఉండటంతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సాంక్రమిక వ్యాధులు విస్తరిస్తున్నాయని తెలిపారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో బాటసారులు నడిచే పరిస్థితి కూడా లేకుండా మారిందన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలు జీవనం సాగించాల్సి రావడం బాధాకరమని బిజెపి నాయకులు పేర్కొన్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా గబ్బిలాల పేట ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదని సమస్యలను పట్టించుకునే నాథుడు కనిపించడం లేదని విమర్శించారు. గతంలో జవహర్ నగర్ అభివృద్ధిపై చేసిన ప్రకటనలు ఫోటోలు ప్రచారానికే పరిమితమయ్యాయని వాస్తవ పరిస్థితి చూస్తే జవహర్ నగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి నెలకొన్నదన్నారు. రాష్ట్ర అధికారంలోకి రాగానే జవహర్ నగర్ సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చేసిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలుకాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా గబ్బిలాల పేట ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.
తక్షణమే ఈ ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ రాష్ట్ర నాయకులు బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి ఉపాధ్యక్షులు రఘురాం చారి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చందు సీనియర్ నాయకులు గిరి కత్తుల వెంకన్న మల్లికార్జున్ గౌడ్ శ్రీధర్ ఆంజనేయులు చారి రామకృష్ణ ప్రవీణ్ విష్ణువర్ధన్ రెడ్డి మల్లేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
