మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
కేసీఆర్ని మేడారం జాతరకు ఆహ్వానించిన కొండా సురేఖ, సీతక్క
తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత(BRS Party Chief), మాజీ సీఎం(Former CM) కేసీఆర్(KCR) సాదర, ఆత్మీయ ఆహ్వానం(Invitation) పలికారు. అతిథి మర్యాదలతో, పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం చేశారు. దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క(Seethakka) గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొద్ది రోజుల్లో మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు.. కేసీఆర్కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, శోభమ్మ దంపతులు.. వారిని పసుపు కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలతో సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు.. కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. తొలుత.. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు.
