కార్మిక, ఉపాధి, గనుల శాఖల మంత్రి(Minister of Labor & Employment and Mines) డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి(Dr.G.Vivek Venkataswamy) మందమర్రి పట్టణంలో సీసీ రోడ్డు(CC Road), అభివృద్ధి పనులను(Development Works) ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా(Manchryala District) కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులతో కలిసి రోడ్డు పనులకు భూమి పూజ(Bhoomi Puja)లో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భగత్ సింగ్ నగర్ నుంచి శ్రీపతినగర్ వరకు కొత్త సీసీ రోడ్డును నిర్మించనున్నారు. దీనివల్ల పట్టణంలో రవాణా సౌకర్యం మెరుగుపడి స్థానికులకు ఉపశమనం కలగనుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. పట్టణ, గ్రామ ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
