- ప్రారంభకులుగా హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ: పి. సుగుణాకర్ రావు
రైతులు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ, ‘కిసాన్ జాగరణ్’ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున “కిసాన్ గ్రామీణ మేళా”ను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ప్రదర్శనలకు దూరప్రాంత రైతులు వెళ్లలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు.
లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు: కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా.. పామాయిల్, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి మార్గాల ద్వారా ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఎలా పొందాలనే అంశంపై రైతులకు దిశానిర్దేశం చేయనున్నారు.
నీరు నిలిచే పొలాల్లో మత్స్య సాగు:
ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ పరివాహక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వరి పంట దెబ్బతింటున్న పొలాల్లో.. చేపలు, రొయ్యల పెంపకం ద్వారా అధిక లాభాలు గడించే విధానాలను వివరిస్తారు.
ఎఫ్పిఓ ల బలోపేతం:
చింతకుంట ఎఫ్పిఓ (శంకరయ్య ఆధ్వర్యంలో రూ. 2 కోట్ల టర్నోవర్), కోనరావుపేట ఎఫ్పిఓ (పురుషోత్తం రావు తేనెటీగల ప్రాజెక్ట్), బోయినపల్లి ఎఫ్పిఓ (వేణుగోపాల్ రావు ) సాధిస్తున్న విజయాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రైతులను చైతన్యపరచనున్నారు.
నూతన సాంకేతికత:
యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ వినియోగం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం, గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే ఆధునిక పరికరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన ప్రగతిశీల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
