Homeమహబూబ్‌నగర్‌MLA |బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయి

MLA |బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయి

  • పదేళ్లలో ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
  • నేడు బిఆర్ఎస్ నాయకులు నీతులు వల్లించడం సిగ్గుచేటు.
  • వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి..

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యం అయిపోయాయని, ఎందరో సర్పంచులు అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని తన నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరా అధినాయకులు అందిన కాడికి దోచుకొని గ్రామస్థాయిలోని సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ప్రభుత్వ పరమైన ఇబ్బందులను తట్టుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. సర్పంచుల ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమైన నాయకులు నేడు నిస్సిగ్గుగా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

పదేళ్లు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్ననాడే ఓడిపోయిన వ్యక్తివి ఎందరో నాయకుల శ్రమ ఫలితంగా గెలిచి ఒక్కసారి పదవిలో ఉండి వందేళ్ళ సంపాదన సంపాదించుకున్న నీకు గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడి నైతిక హక్కు లేదని ఇలాంటి కబ్జాకోరుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత వనపర్తి నియోజకవర్గంలో ఓ మాజీ మంత్రి వలన బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పిన ఇక్కడి నాయకులకు మాత్రం సిగ్గు శరం లేదని ఆయన విమర్శించారు. తల్లి లాంటి ఆడకూతుళ్ళపై ఇష్టానుసారంగా మాట్లాడే నీచుల మాటలు వనపర్తి ప్రజలు నమ్మబోరన్నారు.

- Advertisement -
Village Panchayats Weakened Under BRS RuleWanaparthy MLA 1

ఒకరు చెప్పుతో కొడతామని మరొకరు మా పేరు ఎత్తితే పుచ్చ లేచిపోద్ది అని హెచ్చరించిన నిస్సిగ్గుగా గ్రామాల్లో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి మహావృక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెకిలిస్తుందని.. సర్పంచ్ ఎన్నికలు నిరూపిస్తున్నాయనీ అన్నారు. కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమందడి, గోపాల్ పేట, రేవల్లి, ఖిల్లా ఘణపురం, ఏదుల మండలాలకు చెందిన పలువురు సర్పంచులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News