కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో..
98 స్థానాల్లో పోటీ చేసి 30 స్థానాలు కైవసం
గన్నేరువరం, మల్యాల, తంగెళ్లపల్లి, శంకరపట్నం మండలాల్లో 4 స్థానాల చొప్పున కమలం ఖాతాలోకి
తుది దశ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా ప్రణాళిక
పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిశా నిర్దేశం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ (Karimnagar Parliament Constituency) పరిధిలో వెల్లడైన రెండో దశ (Second Phase) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) ఫలితాల్లోనూ భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మొత్తం 98 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 20 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. గన్నేరువరం మండలం పీచుపల్లి సర్పంచ్గా బీజేపీ అభ్యర్ధి రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రెండో దశ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను సాధించింది. మండలాల వారీగా సాధించిన ఫలితాల విషయానికొస్తే.. అత్యధికంగా గన్నేరువరంలో 5 శంకరపట్నం, మల్యాల, తంగెళ్లపల్లి మండలాల్లో నాలుగు చొప్పున గ్రామ పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంది.
తొలి దశ ఎన్నికల్లో 42 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. రెండో దశ ఫలితాలను కలిపితే ఇప్పటివరకు 79 స్థానాలను బీజేపీ వశమయ్యాయి. ఈ నెల 17న జరగబోయే తుది దశ ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు మండలాల వారీగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న గ్రామాలను లిస్ట్ చేశారు. ఆయా పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు విజయం సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించారు. చివరి రెండు రోజులు ఆయా అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు.
