టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్
వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 2(ఆదాబ్ హైదరాబాద్): జర్నలిస్టుల (Journalists) సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని TUWJ(IJU) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. ఈ నెల 3న(బుధవారం) హైదరాబాద్లో జరిగే మహాధర్నా(Mahadharna)కు సంబంధించిన పోస్టర్ను మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చిన తర్వాతైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తారనుకుంటే రెండేళ్లుగా జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్(Masab Tank)లో ఉన్న రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు మహాధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రెగ్యులర్గా ఇవ్వాల్సిన అక్రిడేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. హెల్త్ కార్డుల(Health Cards)కు దిక్కులేకుండాపోయిందని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక, ఇళ్ల స్థలాలైతే.. అందని ద్రాక్షలా మరాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న చిన్న పత్రికలను ఆదుకోవావాలని డిమాండ్ చేశారు.
‘జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)ని ఎన్నో సార్లు కలిసి చర్చించాం. వినతిపత్రాలు ఇచ్చాం. కానీ.. 20 నెలలుగా అక్రిడేషన్లు (Accreditations) ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. నేటికీ పాత అక్రిడేషన్ కార్డులనే పలుమార్లు రెన్యూవల్ చేస్తున్నారు తప్ప కొత్త కార్డులు ఇవ్వట్లేదు. ఇదేంటని అడిగితే.. ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారు. హామీలు కార్యరూపం దాల్చటంలేదు. అందువల్ల మహాధర్నా ద్వారా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తాం’ అని మధుగౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవరావు, బి.రాజు, జాతీయ కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్, రాష్ట్ర హౌజింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి మన్యం, జిల్లా ఉపాధ్యక్షులు నా కొండ యాదవ్, కమల్ రెహమాన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, జిల్లా నాయకులు పికిలి రాము, రవికాంత్, టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ ఆంజనేయులు, నాయకులు విష్ణు, సురేష్, ఫారుక్ పటేల్, దాచ హరీష్ కుమార్, మహేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
