- గురుమూర్తి కాలనీ వాసుల డిమాండ్…
త్వరలో నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు తమ కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మరోచోటికి తరలించాలని కోరుతూ శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ హాజరై కాలనీవాసులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో కలిసి మద్యం దుకాణం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వారికి అండగా నిలిచారు. కోట నీలిమ మాట్లాడుతూ కాలనీకి వెళ్లే మార్గంలో మద్యం దుకాణం ఉండడం మూలంగా మహిళలు యువతులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

మందుబాబులు పలు సందర్భాలలో మహిళలతో విచక్షణరహితంగా ప్రవర్తించడం బాధాకరమైన అన్నారు. వెంటనే మద్యం దుకాణాన్ని ఇక్కడి నుండి తరలించేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ఈ మద్యం దుకాణాన్ని తరలించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి కాలనీవాసులు ఇచ్చిన సంతకాల వినతిపత్రాన్ని అందజేసి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
