42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ధ్వజం
రెండు సంవత్సరాలుగా జీవోలు, ఆర్డినెన్స్, అసెంబ్లీ తీర్మానాల పేరుతో కాలయాపన చేసి చివరికి జీవోల పేరుతో మరోసారి బీసీల గొంతుకోసిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చట్ట ప్రకారం కాకుండా పార్టీ ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరమని 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి (BC Resevation Sadhana Samithi) ధ్వజమెత్తింది. జీవో 46తో ఎన్నికలకు వెళ్లడం బీసీలను వంచించడమేనని మండిపడ్డారు. చట్టబద్ధత లేకుండా గ్రామ పంచాయతీలకు ఎన్నికలను జరపాలని, పార్టీ పరంగా 42% బీసీలకు కేటాయించి జరపాలని రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ గన్పార్క్లోని అమర వీరుల స్థూపం గన్ పార్క్ వద్ద నిరసన తెలిపింది.

ఈ కార్యక్రమంలో బీసీ మేధావులు ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు(Chiranjeevulu), బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్లతో కలిసి మాట్లాడుతూ తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా (Resign) చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్య సంఘటనగా ఉద్యమిస్తామని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలు భిక్షగాళ్లు కాదని, కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ (Demand) చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర నాయకులు ఎస్.దుర్గయ్య గౌడ్, బోయ గోపి, బైరుశేఖర్ గంగపుత్ర, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, పాలకూరి అశోక్, అవ్వారు వేణు, చెన్న శ్రీకాంత్ నేత, దామోదర్ గౌడ్, ఎర్రమాదు వెంకన్న నేత, లింగేశ్ యాదవ్, మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.
