కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శాసన సభ్యుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. మొత్తం రూ.1,43,16,588/(కోటీ నలభై మూడు లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయల) విలువ గల 143 కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చారు. కోరుట్ల మండలం లబ్ధిదారులకు రూ.2,98,000/(రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల) విలువ గల 13 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా అందజేశారు.
పేద యువతి వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కేసీఆర్ ప్రాంభించారని
ఎమ్మెల్యే అన్నారు.
‘ప్రజలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. 420 హామీలు నెరవేరుస్తామన్న వాగ్దానం కేవలం మాటల్లోనే మిగిలిపోయింది. అబద్ధాలు, వంచనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అందరూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారు’ అని విమర్శించారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రూపకల్పన చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా పథకాలు వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించాయి’ అని పేర్కొన్నారు. ‘ప్రజల అభివృద్ధి–సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, కేసీఆర్ ఆలోచనలతో ముందుకు సాగుతూ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
