మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత..
హనుమాన్ మాలధారులు, విశ్వహిందూ పరిషత్ ఆందోళన..
ఉపాధ్యాయుడినీ సస్పెన్షన్ చేయాలని డిమాండ్.
నల్గొండ -: హిందూ ధార్మిక ఆచారాలను పాటించినందుకు గాను ఒక విద్యార్థిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) ఉపాధ్యాయుడు అవమానించి, తరగతి గది నుంచి బయటకు పంపిన ఘటన మునుగోడు మండల కేంద్రంలోని పలివెల ఉన్నత పాఠశాలలో (ZPHS) మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పాటు, సదరు ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలు ఇలా…
మునుగోడు నియోజక వర్గం, జెడ్పీహెచ్ఎస్ పలివెల గ్రామం పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి హనుమాన్ మాల ధారణ చేసి పాఠశాలకు హాజరయ్యాడు. అయితే, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గ్యార నరసింహ ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యార్థిని అందరి ముందు తీవ్రంగా అవమానించడంతో పాటు, మాలధారణతో పాఠశాలకు రాకూడదంటూ ఆదేశిస్తూ అతడిని తరగతి గది నుంచి బలవంతంగా బయటకు పంపినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని హనుమాన్ మాలధారులు, హిందూ సంఘాల ప్రతినిధులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకున్న వారు ఉపాధ్యాయుడు గ్యార నరసింహ ప్రవర్తనను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ధార్మిక మనోభావాలు దెబ్బతీశారు..
మాలధారణ అనేది భక్తి భావంతో కూడుకున్న అంశమని, ఒక ఉపాధ్యాయుడిగా ఉండి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం సరికాదని నిరసనకారులు మండిపడ్డారు. ఉపాధ్యాయుడు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడు గ్యార నరసింహను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థికి న్యాయం జరిగే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.
