- ఫీల్డ్ పేరుతో కార్యాలయానికి డుమ్మా.
- రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షణలు.
- పట్టించుకోని మున్సిపల్ కమిషనర్, ఉన్నత అధికారులు.
సూర్యాపేట మున్సిపాలిటీలో ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారి, తమ సౌకర్యానుసారం కార్యాలయానికి సమయానికి హాజరు కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు కార్యాలయం ప్రారంభం కావాల్సి ఉన్నా, సంబంధిత అధికారి తరచూ ఆలస్యంగా వస్తున్నారని స్థానికులు తెలిపారు. మంగళవారం కూడా 10 గంటలకు రావాల్సిన అధికారి, పలువురు పౌరులు ఫిర్యాదుల కోసం వచ్చినట్టు తెలిసి 11 గంటల తర్వాత కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

తూతూ మంత్రంగా విధులు :
దీంతో కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. రెవెన్యూ అధికారి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదని సిబ్బంది చెప్పకనే చెప్తున్నారు.
ఫీల్డ్ కు వెళ్తున్నాం అనే చెప్తూ రోజంతా కార్యాలయానికి రాకపోవడం, ఉద్యోగం చేసే పట్టణంలో నివాసం లేకపోవడం వల్ల తరచూ గైర్హాజరు అవుతున్నారని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు పరిస్థితి తెలిసినా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ప్రశ్నలెత్తిస్తోంది. అన్నీ తెలిసిన కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మందలించిన మారని తీరు :
గతంలో రసీదు బుక్ వ్యవహారంలో నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారుల మందలింపులు ఎదుర్కొన్నప్పటికీ, ఆ అధికారి తీరు మారలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని శాఖల ఉద్యోగులు సమయపాలన పాటించాల్సి ఉన్నా, సూర్యాపేట మున్సిపాలిటీలో ఆ ఆదేశాలు గాలికొదిలినట్లు స్పష్టమవుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నవారే విధులు నిర్లక్ష్యం చేస్తే, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి హాజరు కాని, వ్యక్తిగత పనుల్లో మునిగిపోయే ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ విషయం పై మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డిను వివరణ కోసం సంప్రదించగా, ఆయన స్పందించలేదు.
