- ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం
- బకాయిలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో యాజమాన్యాల భేటీ
- రూ.600 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
- బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించిన విద్యా సంస్థల సమాఖ్య
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు, చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
తక్షణమే రూ.600 కోట్ల విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరో రూ. 300 కోట్లు త్వరలో చెల్లించడానికి హామీ ఇచ్చారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. ఫీజు రీయింబర్స్మెంట్? పై ప్రభుత్వ కమిటీ వేస్తామని.. కమిటీలో ప్రభుత్వాధికారులతో పాటు కాలేజీ యాజమాన్యాల సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు.
కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైనా సంస్కరణలు అవసరమో చేపడతామని తెలిపారు. భట్టి ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అంగీకారం తెలపడంతో చర్చలు సఫలం అయ్యాయి. చర్చలు ఫలించడంతో బంద్ విరమిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.
దీంతో 2025, నవంబర్ 8 నుంచి కాలేజీలు యధావిధిగా నడవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కళాశాల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు తెరుచుకోనున్నాయి.
