నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు…హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన 20మంది యువకులు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు వచ్చారు.ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యాం అవతలి వైపు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.అనంతరం స్నానం చేసేందుకు వినయ్, సాయి అనే ఇద్దరు నదిలోకి దిగారు.ఈ క్రమంలో వినయ్ అనే యువకుడు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా మరో యువకుడు సాయి కాపాడేందుకు ముందుకు వెళ్లగా ఇద్దరు సైతం ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి నీటి మధ్యలో ఉన్న చెట్లను పట్టుకొని ఆగారు.అక్కడ బిక్కు బిక్కు మంటూ ఉండగా తోటి స్నేహితులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ, పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.ఉన్నతాధికారులకు సమాచారం అందించగా డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జి, అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.ఫైర్, పోలీసు సిబ్బంది తాడు సాయంతో నదిలోకి దిగి ఇద్దరిని ఒడ్డుకు తీసుకువచ్చారు.సంబంధీకులకు అప్పగించారు.ఈ సందర్భంగా యువకుల ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక, పోలీసు సిబ్బందిని తోటి స్నేహితులు, స్థానికులు అభినందించారు.ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నిమజ్జనాలకు కోసం వచ్చే వారు నది ప్రవాహం వైపు వెళ్లొద్దని సూచించారు.పోలీసు అధికారుల సూచనలు పాటించాలన్నారు.పోలీసు, క్యూఆర్టీ టీమ్, అగ్నిమాపక సిబ్బంది, తదితరులున్నారు.