- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ పాలక మండలి
- భక్తులకు మరింతగా సేవ చేసేందుకు కృషి చేస్తా : ఈవో
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ను టీటీడీ బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ 2025ను విడుదల చేశారు. దాంతో పాటు టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్కు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన ఈవోను టీటీడీ చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు. టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనిల్ కుమార్ సింఘాల్ కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సలహాలు, సహాకారంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా ఈవో తెలిపారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను సన్మానించారు.
