Friday, February 13, 2026
Homeతెలంగాణఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court of India)లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని కౌషిక్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి.. కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి… మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్‌ టైమ్‌ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా?’’ అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి తెలిపారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని రోహత్గికి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News