- ఏకంగా 14 దూడలపై దాడి..
- అప్రమత్తమైన అధికారులు..
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి తీవ్ర కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న పశువుల మందపై రాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఏకంగా 14 దూడలను పొట్టనబెట్టుకుంది. ఈ ఉదయం పశువుల కాపరులు, యజమానులు వెళ్లేసరికి దూడల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలను చూసి వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పులి సంచారంతో గంగంపాలెం, చుట్టుపక్కల గ్రామస్తులు ప్రస్తుతం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అడిషనల్ పీసీసీఎఫ్ నాగేశ్వరరావు, కాకినాడ డీఎఫ్వో రామచంద్రరావుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘రాపిడ్ రెస్క్యూ టీమ్’ ఒక ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించింది. పులి అడుగుజాడలను గుర్తిస్తూ, దాన్ని సురక్షితంగా బంధించేందుకు బోన్లు, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పులి సంచారం ఇంకా కొనసాగుతున్నందున అటవీ ప్రాంత సరిహద్దుల్లోని ప్రజలు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు సూచించారు.
