Monday, June 29, 2026
Homeసినిమాసూర్య హీరోగా చిత్రాన్ని అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

సూర్య హీరోగా చిత్రాన్ని అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

భారతీయ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం రూపొందనుంది. పవర్ ఫుల్ కథను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెండు దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. రెండు జాతీయ పురస్కారాలు, ఏడు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు అందుకున్న ఆయన, కమర్షియల్ విజయాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎన్నో చిత్రాల్లో నటించారు. నిర్మాతగా కూడా విలువైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

- Advertisement -

దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ ‘జై భీమ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. సామాజిక అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ఆ చిత్రం భారతీయ సినిమాల్లో అత్యధిక IMDb రేటింగ్ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బలమైన భావోద్వేగాలు, ఆలోచింపజేసే కథనాలతో ఆయన సమకాలీన దర్శకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహను కూడా ప్రేక్షకులకు అందిస్తోంది.

ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. “అభిరుచి, అంకితభావం కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసినప్పుడే గొప్ప సినిమాలు పుడతాయని మేము ఎప్పుడూ నమ్ముతాం. సూర్య గారు, టి.జే. జ్ఞానవేల్ గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే నిజాయితీగల, అర్థవంతమైన కథను చెప్పబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కె. కదిర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమం జూన్ 29, 2026న చెన్నైలోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అత్యున్నత నటుడు, ట్యాలెంటెడ్ నటి, విజనరీ దర్శకుడు, భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ కలిసి చేస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన సినీ అనుభూతిని అందించనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News