- సింహాచల దర్శనం సర్వపాపహరం..
- అక్షయ తృతీయ రోజున అప్పన్నకు చననోత్సవం..
- స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అద్భుత అవకాశం..
పురాణాల ప్రకారం హిరణ్యాక్షుని సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహస్వామి కలిసి ఒకేచోట వెలసిన పుణ్యక్షేత్రం సింహాచలం. కృత యుగంలో ప్రహ్లాదుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన వారితో పూజలందుకున్న వరాహ నరసింహుడు భక్తుల పాలిట ఆర్తత్రాణ పరాయణుడై విరాజిల్లుతున్నాడు. వైశాఖ మాసంలో శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరుగుతుంది..
సింహాచలం క్షేత్ర స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని భక్త ప్రహ్లాదుడు నిర్మించినట్లుగా తెలుస్తోంది. కలియుగానికి వచ్చేసరికి ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం కాలగర్భంలో కలిసిపోయి వరాహ నరసింహుడు పుట్టలోనే ఉండిపోయాడంట! కొన్నాళ్లకు పురూరవ చక్రవర్తికి స్వామి స్వప్నంలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించగా చక్రవర్తి పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించినట్లుగా సింహాచల క్షేత్ర మహత్యంలో వివరించి ఉంది.
స్కంద పురాణం ప్రకారం సింహాచల నరసింహుని ఆదేశం మేరకు స్వామి విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచే ఆచారం పురూరవ చక్రవర్తి కాలం నుంచే ఉండేదని తెలుస్తోంది. అయితే పురూరవుడు పుట్ట నుంచి స్వామి విగ్రహాన్ని వెలికితీసే క్రమంలో స్వామి పాదాలు మాత్రం భూమిలోనే ఉండిపోయాయంట! అందుకే సింహాచల క్షేత్రంలో స్వామి పాదాలు కనిపించవు.
సింహాచలం క్షేత్ర మహత్యంలో వివరించిన ప్రకారం హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహ స్వామి ఉగ్రరూపానికి సమస్త లోకాలు కంపించి పోయాయంట! అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నరసింహ స్వామితో ‘స్వామి! నీ శాంత రూపాన్ని సందర్శించుకునే భాగ్యం ఎప్పుడు?’ అని అడగ్గా, నరసింహ స్వామి బ్రహ్మతో “నేను శ్రీలక్ష్మీదేవితో కలిసి సింహాచలంపై వెలసి శాంతరూపంలో ప్రహ్లాదునితో పూజలందుకుంటాను” అని చెప్పాడంట! ఆ ప్రకారంగా సింహాచలంలో నరసింహ స్వామి సింహాద్రి అప్పన్నగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఏడాదికోసారి తన విగ్రహంపై ఉన్న చందనపు పూతను తొలగించాలని సింహాద్రి అప్పన్న పురూరవ చక్రవర్తిని ఆదేశించాడంట! ఆ ప్రకారంగా ఏడాదికోసారి అక్షయ తృతీయ రోజు సింహాద్రి అప్పన్న విగ్రహంపై ఉన్న చందనపు పూతను తొలగించి భక్తులకు స్వామి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ ఉత్సవాన్ని చందనోత్సవం అంటారు. ఈ సందర్భంగా స్వామి 12 గంటల పాటు నిజ రూపంలో దర్శనమిస్తాడు.
