- పుణ్యమూర్తి పురందరదాసు..
భగవంతునికి చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఒకరు భగవంతుని సేవిస్తారు. మరొకరు భగవంతుని కోసం తపస్సు చేస్తారు. మరొకరు తమకున్న విద్యతో భగవంతుని మీద కీర్తనలు రచించి ఆ గానామృతంతో భగవంతునికి చేరిక అవుతారు. ఇలా తమ గానామృతంతో భగవంతుని చేరిన భక్తులు మన దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. అలాంటి మహనీయుల్లో పురందరదాసు ఒకరు.
సంసార భవబంధాలనే సాగరాన్ని దాటడానికి విఠలుని శరణు వేడడమే మార్గమని తలచి, ఆ ప్రయత్నంలో తంబుర మీటుతూ ఎన్నో గేయాలు రచించిన వాగ్గేయకారుడు పురందర దాసు. ఆయన స్వానుభావాలతో కూడిన ఆ కీర్తనలు కాలక్రమేణా వేదాంత ప్రభోధాలై ఎందరినో అలరించాయి.
పురందర దాసు 1470 లో మహారాష్ట్రలోని పుణేకు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించాడు. ఈయన అసలు పేరు శ్రీనివాసుడు. వృత్తిరీత్యా శ్రీనివాసుడు ఒక వజ్రాల వ్యాపారి. తిరుమల వేంకటేశ్వర స్వామికి పరమ భక్తులైన ఈయన తల్లిదండ్రులు తమ కుమారుడికి శ్రీనివాసుడని పేరుపెట్టి గారాబంగా పెంచుకోసాగారు. యుక్తవయసు రాగానే శ్రీనివాసునికి సుగుణాలరాశి అయిన సరస్వతీబాయితో వివాహం జరిపించారు. చిన్నప్పటి నుంచి పురంధరునికి స్వతహాగా ఆధ్యాత్మిక చింతన ఉండేది కాదు.
తన తండ్రి తరువాత వ్యాపార బాధ్యతలు సక్రమంగా నిర్వహించి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించాడు. శ్రీనివాసుడు వ్యాపారంలో గొప్ప లాభాలు ఆర్జించాడు. సంపదలు పెరిగేకొద్దీ అతనిలో లోభత్వం కూడా పెరిగింది. అందరూ అతనిని ‘మహా పిసినారి’ అనేవారు. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు అతని కుమారుని ఉపనయనానికి ధన సహాయం కోరుతూ శ్రీనివాసుని కలిశాడు. కానీ శ్రీనివాసుడు మాత్రం అతనికి డబ్బు ఊరికే ఇవ్వడం ఇష్టం లేక ‘రేపు రా!’ ‘మాపు రా!’ అంటూ ప్రతిరోజూ తిప్పించుకోసాగాడు. ఇక ఆ బ్రాహ్మణుడు విసుగు చెంది శ్రీనివాసుని భార్యను కలిసి విషయం వివరించాడు. ఆమె ఎంతో దయతో తన వజ్రపు ముక్కెరను తీసి అతనికిచ్చి పంపింది.
ఆ పేద బ్రాహ్మణుడు తన కుమారుని ఉపనయనానికి అవసరమైన ధనం కోసం శ్రీనివాసుని భార్య ఇచ్చిన వజ్రపు ముక్కెరను అమ్మడానికి శ్రీనివాసుని వద్దకు వెళ్లాడు. శ్రీనివాసుడు ఆ వజ్రపు ముక్కెరను చూడగానే అది తన భార్యదే అని గ్రహించాడు. తనకు తెలియకుండా భార్య చేసిన పనికి ఆగ్రహించి ఎలాగైనా నిజం రాబట్టాలని భార్య వజ్రపు ముక్కెర తెమ్మని నౌకరుని ఇంటికి పంపాడు. భర్త పంపిన నౌకరు ఇంటికి వచ్చి ముక్కెర అడగగానే సరస్వతి ఆందోళన చెందింది.
తన వజ్రపు ముక్కెర బ్రాహ్మణునికి దానం ఇచ్చానని తెలిస్తే భర్త చంపేస్తాడని భయపడింది. భర్త కాఠిన్యం తెలిసి విషం తీసుని చనిపోవాలని నిర్ణయించుకుంది. పుండరీక విఠలుని స్మరించి చేతిలోకి విషం తీసుకోగానే ఆ విషం కాస్త వజ్రపు ముక్కెరగా మారిపోయింది. అదంతా పాండురంగ విఠలుని మహిమగా భావించి నౌకరుకు ఆ ముక్కెర ఇచ్చి పంపింది.
జరిగిన ఘటన మొత్తం చూసి ఆశ్చర్యపోయిన శ్రీనివాసుడు ఇంటికి వెళ్లాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెంది ఆ పేద బ్రాహ్మణుని కోసం వెతికించాడు. అలాంటి వాళ్లెవరు రాలేదని స్పష్టం కావడంతో శ్రీనివాసునికి జ్ఞానోదయం అయింది. పేద బ్రాహ్మణుని రూపంలో తనకు జ్ఞానోదయం కలిగించి మరెవరో కాదు సాక్షాత్తు పాండురంగ విఠలుడే అని గ్రహించాడు. ఆనాటి నుంచి అతనిలో ఎంతో మార్పు వచ్చింది.
