- ఒకే పేపర్తో రెండు పరీక్షలా?
- రేవంత్ సర్కార్పై తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్..
ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన లా కోర్సుల పరీక్షల గందరగోళంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విపక్ష నేతలు మండిపడ్డారు.
ఫిబ్రవరి 25న ఐదేళ్ల లా కోర్సు విద్యార్థులకు “ హిస్టరీ ఆఫ్ కోర్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా ” అనే సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఆశ్చర్యకరంగా, ఫిబ్రవరి 27న జరిగిన మూడేళ్ల హానర్స్ లా కోర్సు విద్యార్థుల “లీగల్ అండ్ కాన్ స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ” పరీక్షకు కూడా దాదాపు అదే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశారు. రెండు వేర్వేరు కోర్సులకు, రెండు వేర్వేరు తేదీల్లో ఒకే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం విద్యావర్గాల్లో కలకలం రేపింది. “ఒక ప్రశ్నపత్రాన్ని కూడా సక్రమంగా సిద్ధం చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా సమర్థంగా నడిపిస్తుంది?” అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఈ ఘటన విద్యాశాఖలో ఉన్న సమన్వయ లోపానికి, నిర్లక్షానికి అద్దం పడుతోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు బీ ఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ గారు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న అవ్యవస్థ, పరిపాలనలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉస్మానియాలో ఐదేళ్ల లా కోర్సు (ఫిబ్రవరి 25), మూడేళ్ల హానర్స్ లా కోర్సు (ఫిబ్రవరి 27) పరీక్షలకు ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రెండు పేపర్లు ఒకేలా రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 25న జరిగిన పరీక్ష అనంతరం, ఫిబ్రవరి 27న జరిగిన పరీక్షకు అదే ప్రశ్నాపత్రం ఎలా వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రశ్నాపత్రం సైతం సక్రమంగా సిద్ధం చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా సమర్థంగా నడిపిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

బంకర్ బెడ్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, రూ. 60 కోట్లకు రావాల్సిన బెడ్లను రూ. 160 కోట్లకు కొనుగోలు చేసి దాదాపు రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. “ఇదేం రాజ్యం? ఇదేం ప్రజా పాలన?” అంటూ మండిపడ్డారు.
గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన తప్పులు, ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత, రిజిస్ట్రేషన్ కార్యాలయాల విషయంలో తీసుకున్న వెనుకడుగు, తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఉన్న లోపాలు.. ఇవన్నీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలన్న సిఫార్సులు విద్యార్థి వ్యతిరేక చర్యలని అన్నారు. ప్రభుత్వం వద్ద రూ. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించిన రూ. 1,000 కోట్లు ఎక్కడ వినియోగమయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన డా. బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.
“పరిపాలన చేయలేకపోతే దిగిపోవాలి. విద్యా శాఖను చదువుకున్న, బాధ్యతగల వ్యక్తులకు అప్పగించాలి. దోపిడీ తప్ప ఈ ప్రభుత్వానికి మరేమీ తెలియదు” అని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
