- ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రంలో క్రీడా పోటీలు
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో భైంసాలోని ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రంలో క్రీడాకారులకు వివిధ వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు. శిక్షణ కేంద్రం కోచ్ సాయికృష్ణ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ రజిత పతకాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చడం, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తిని పెంపొందించడమే జాతీయ క్రీడా దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యువత ప్రతిరోజూ క్రీడలు, వ్యాయామం, యోగా వంటి శారీరక కార్యకలాపాలకు సమయం కేటాయించాలని సూచించారు. “ఆరోగ్యమే మహాభాగ్యం – క్రీడలే ఆరోగ్యానికి పునాది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ముగ్ధం విక్రమ్, ప్రకాష్ పాటిల్, ఉప్పు రవీందర్, శ్రీ సాయినాథ్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రం క్రీడాకారులు, కోచ్లు, క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
