కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ జిహెచ్ఎంసి ప్రాంతంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోటపల్లి శంకర్ మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వం గతంలో కార్మికుల పూర్వీకులు పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించడం ద్వారా కార్మికుల హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. చట్టాల విభజన వల్ల కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది కార్మికుల పొట్టను కొట్టినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులు చైతన్యవంతులై ఈ నాలుగు కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీసం 26,000 వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నిమ్మల నరసింహ, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి వి స్వరూప నాయక్, ఏఐటిసి కాప్రా మండల అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, మహిళా సమైక్య అధ్యక్షురాలు కోదాసు జయమ్మ, ఏ లక్ష్మి, డి మల్లికతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
