Wednesday, June 3, 2026
HomeజాతీయంKarnataka | చిక్కుల్లో ఇరుక్కున్న ఓ రాష్ట్ర హోం మంత్రి..

Karnataka | చిక్కుల్లో ఇరుక్కున్న ఓ రాష్ట్ర హోం మంత్రి..

  • కబడీ టోర్నీలో ఓ జట్టుపై పందెం కాసిన మినిస్టర్..
  • కేసు నమోదు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి..

ఒక రాష్ట్ర హోంమంత్రి చిక్కుల్లో పడ్డారు. కబడ్డీ టోర్నీ సందర్భంగా ఒక టీం గెలుపుపై సరదాగా పందెం కాశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించగా ఆ హోంమంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. తుమకూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రీ యూనివర్సిటీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్‌లో ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయపుర జట్టు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ శుభా కల్యాణ్‌తో సరదాగా రూ.500 పందెం కాశారు. కాగా, కబడ్డీ మ్యాచ్‌లో విజయపుర జట్టుపై దక్షిణ కన్నడ జట్టు గెలిచింది. హోంమంత్రి జీ పరమేశ్వర విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కబడ్డీ మ్యాచ్‌పై తాను సరదాగా రూ.500 పందెం కాసి ఓడిపోయినట్లు బహిరంగంగా వెల్లడించారు.

- Advertisement -

మరోవైపు హెచ్.ఆర్. నాగభూషణ్ అనే వ్యక్తి దీనిపై కోర్టులో ఫిర్యాదు చేశారు. సరదాగా చేసినప్పటికీ బహిరంగంగా పందెం కాయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ముఖ్యంగా కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బెట్టింగ్‌ను ప్రోత్సహించకూడదని ఆయన వాదించారు.

కాగా, బెంగళూరులోని 42వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కేఎన్‌ శివకుమార్‌ ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో పందెం కాసిన హోంమంత్రి జీ పరమేశ్వర్‌పై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ దీనిపై హోంశాఖకు రిపోర్ట్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News