- చిన్న వయసు పెద్ద లక్ష్యం, డ్ర**గ్స్ కి వ్యతిరేకంగా ధైర్య యాత్ర “సే నో టు డ్ర**గ్స్”
స్థానిక సీతారాంపూర్ లోని ఐ వి వై ( సీబీఎస్సీ) పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి లెంకల వివేకానంద రెడ్డి ప్రపంచంలోని ఏడు శిఖరాలలో రెండవదైన ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియస్కో ను విజయవంతంగా అధిరోహించాడు. గత సంవత్సరం కూడా ప్రపంచంలో ఏడు శిఖరాలలో ఒకటైన యూరప్ లోని మౌంట్ ఎల్బస్ 5642 మీటర్ల ఎత్తైన హిమంతో నిండి కప్పబడి ఉన్న శిఖరాన్ని కూడా అధిరోహించాడు. ఈ యాత్రను ఆయన “సెవన్ సమ్మిట్” లక్ష్యంతో చేపట్టగా, తన తండ్రి మహిపాల్ రెడ్డి ప్రోత్సాహం ఎంతో కీలక పాత్ర పోషించింది.
ఈ పర్వతారోహణ కేవలం ఒక సాహసం మాత్రమే కాకుండా, సమాజానికి ఒక శక్తివంతమైన సందేశం. “నో డ్ర**గ్స్” డ్ర**గ్స్ కి దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా , డ్ర**గ్స్ వదిలేసి డ్రీమ్స్ పట్టుకో , మత్తు వద్దు మంచి భవిష్యత్తు కావాలి , అనే నినాదంతో, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.

“మాదకద్రవ్యాలు మీ ఆశయాలను కూల్చివేస్తే, పర్వతాలు మీ సంకల్పాన్ని నిర్మిస్తాయి” అనే సందేశంతో వివేకానంద తన ధైర్యాన్ని చాటిచెప్పాడు. తన తదుపరి లక్ష్యంగా గ్రేట్ డివైడింగ్ రేంజ్ శిఖరాలను అధిరోహించాలని సంకల్పించిన ఆయన, “పట్టుదల ఉంటే ఏ పర్వతం ఎత్తైనది కాదు” అని నిరూపించాడు.
ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఇంత గొప్ప విజయాన్ని సాధించిన వివేకానందను అభినందిస్తూ, అతని తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
