- ఉదయం నుంచి కొనసాగిన ప్రత్యేక పూజలు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రంలో కొలువుదీరిన దత్త సాయి ఆలయ నాలుగవ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ శర్మ తోపాటు పలువురు పూజారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. మహా గణపతి పూజ, విశేష సంకల్పం, గోపూజ, భగవత్ ప్రార్థన, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, నవగ్రహ సర్వతోభద్ర మండల ఆరాధన, అష్టోత్తర కలశాభిషేకం, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవతాహోమం, మూలమంత్ర హోమం, బలిప్రధానం, పూర్ణాహుతి, మంత్రపుష్పము తదితర పూజారి కార్యక్రమాలను వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిపించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్మల్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు ఉప్పుల నందు, కోల శంకర్, పండరి, గంగాధర్, నారాయణ, భూమన్న, అజయ్, రాజేష్, గోవర్ధన్, సాతర్ల శ్రీనివాస్, హిమజ, సరోజ, కళ్యాణి, నవ్య తదితరులతోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
