- స్థానికుల్లో హర్షం, త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి
శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రామిక మహిళల కోసం వసతి గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో జవహర్ నగర్ ప్రాంతంలో ఆనంద వాతావరణం నెలకొంది. గతంలో పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఫలితంగా ఈ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరి జోన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో సర్వే నంబర్ 647కు చెందిన ఒక ఎకరం ఇరవై గుంటల స్థలంలో ఆదివారం శ్రామిక మహిళ వసతి గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు.

పనుల ప్రారంభానికి ముగ్గు పోసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసతి గృహం నిర్మాణంతో ఉద్యోగాలు, పనుల నిమిత్తం నగరానికి వచ్చే అనేకమంది శ్రామిక మహిళలకు సురక్షిత వసతి లభించనుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. శ్రామిక మహిళా వసతి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

