- స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సదస్సు..
- గ్రామ సర్పంచ్ కాండికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
అబ్దుల్లాపూర్మెట్ మండలం, బండరావిరాల గ్రామ పరిధిలోని 268 సర్వే నంబరులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన‘ఏకో టౌన్’ (డంపింగ్ యార్డు) ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ శనివారం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణ ఇంజనీర్ దుబ్బ గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎకో టౌన్’ లాంటి పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేసే ముందు పరిసర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించడం కనీస బాధ్యత అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దీనివల్ల స్థానికులకు జరిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డుల ద్వారా వెలువడే విషవాయువుల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, పర్యావరణం కలుషితమవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబందించిన కరపత్రం కూడా విడుదల చేసారు.
అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎకో టౌన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పరిసర ప్రాంతాల గ్రామ పంచాయతీల తీర్మాన ప్రతులను ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ని అలాగే జిల్లా కలెక్టర్కి, HMDA కమీషనర్, TGIIC వైస్ చైర్మన్, పిసిబి మెంబెర్, సెక్రటరీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి మొరపెట్టుకున్నప్పటికీ, ఆయన ఇచ్చిన సమాధానాలు తీవ్ర నిరాశకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం, వారి భవిష్యత్తు కోసం తాను సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని హెచ్చరించారు. ప్రజలందరినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దేశ్ముఖి సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, పిల్లాయిపల్లి సర్పంచ్ పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య, జగత్పల్లి సర్పంచ్ ఇట్టబోయిన మహేష్ యాదవ్, కొత్త కిషన్ గౌడ్, పిల్లాయిపల్లి మాజీ సర్పంచ్ హరీష్ యాదవ్, అబ్బవతిని బసవయ్య, గ్రామ పెద్దలు కందికంటి బిక్షపతి, చింతల రాజిరెడ్డి, మొలుగు అర్జున్, కావాడి దయాకర్ రెడ్డి, చింతకింది మనోహర్ యాదవ్, గుండ్ల సతీష్ యాదవ్, తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
