- పంజాబీ ఫ్యామిలీ దాబాకు రెండు వేలు గరిడేపల్లి,కీతవారిగూడెం ఫేమస్ బేకరీలకు పదివేలు జరిమానా
- ఎక్స్ పైరీ ఆహారంతో ఒక ఫేమస్ బేకరీ సీజ్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి.ప్రభాకర్
గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని ఫేమస్ బేకరీలో బూజు పట్టిన కేక్ విక్రయించి చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు గురువారం గరిడేపల్లి మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
ముందుగా కీతవారిగూడెం గ్రామంలోని ఫేమస్ బేకరీని తనిఖీ చేసిన అధికారులు ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. బేకరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు.పరిశుభ్రతపై పలు సూచనలు జారీ చేశారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని పంజాబీ ఫ్యామిలీ దాబాలో తనిఖీలు నిర్వహించగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, నిర్వహణ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో దాబా యాజమాన్యానికి రూ.2,000 జరిమానా విధిస్తూ వెంటనే పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

తర్వాత గరిడేపల్లి మండల కేంద్రంలోని ఫేమస్ బేకరీని తనిఖీ చేసిన అధికారులు అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార పదార్థాల తయారీ, గడువు ముగిసిన (ఎక్స్పైరీ) పదార్థాల వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆహార నిల్వ వంటి పలు ఉల్లంఘనలను గుర్తించారు. తీవ్ర ఉల్లంఘనల నేపథ్యంలో బేకరీని వెంటనే సీజ్ చేసి, రూ.5,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్, గరిడేపల్లి ఎస్ ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అన్ని హోటళ్లు, బేకరీలు, ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, లైసెన్సులు కలిగి ఉండాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు అవసరమైతే సీజ్ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో కీతవారిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి జానకి, గరిడేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, బిల్ కలెక్టర్ రావుల వెంకన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
