- వెంకటాపూర్ కాలనీలో చోరీల కలకలం.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో ఒకే రాత్రి వరుస చోరీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. కాలనీలో నివసించే లింగన్న, సునీత, లక్ష్మి ఇళ్లలోకి చాకచక్యంగా ప్రవేశించిన దొంగలు అల్మారాలు, బీరువాలు గాలించి చేతికందిన విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఉదయం ఇంటి యజమానులు వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి, ఇంటి సామగ్రి చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య, పోలీసులు చోరి జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
