- ఎగుమతుల్లో ఇకపై దాదాపు 99 శాతం సుంకాల మినహాయింపు..
భారత్-యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చింది. దీంతో బ్రిటన్కు భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఇకపై దాదాపు 99 శాతం వస్తూత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లేదా తక్కువ భారం పడనున్నది. అలాగే బ్రిటన్ నుంచి భారత్కు వచ్చే 90 శాతం వస్తూత్పత్తుల విషయంలోనూ ఇదే వర్తించనున్నది. కాగా, సీఈటీఏతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, సేవా రంగాలు బలోపేతమవడమేగాక, పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులకూ అవకాశాలుంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది.
ముఖ్యంగా ఆటోమోటివ్, తయారీ, కన్జ్యూమర్ గూడ్స్, క్రియేటివ్ ఇండస్ట్రీస్, మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రోత్సాహం లభిస్తుందని వాణిజ్య, వర్తక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సీఈటీఏతో ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆశాభావం వ్యక్తం చేశారు. సనత్నగర్లోని ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) కార్యాలయంలో తెలంగాణ నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడంతో రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని కూడా అన్నారు.
భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం.. విస్తృత శ్రేణి ఉత్పత్తులకు పన్ను రాయితీలను కల్పిస్తుందని విదేశీ వాణిజ్య విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ డా సంపత్ కుమార్ అన్నారు. ప్రధానంగా బ్రిటన్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల అమ్మకాలకు, వాటి ఎగుమతులకు అవకాశాలను గణనీయంగా పెంచగలదని చెప్పారు. అలాగే విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ భవానీ శ్రీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో లభించే ప్రయోజనాలు చిన్న పరిశ్రమలకు పెద్దగా అందుతాయని పేర్కొన్నారు.
