- ఆరోపించిన బీ.ఆర్.ఎస్. నేత కేటీఆర్..
- గన్ పార్క్ కు వెళ్లి మంత్రి ఏమి చేస్తారు..?
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. కానీ సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులే ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్రెడ్డి మొదట చర్చకు సవాల్ విసిరారని తెలిపారు. తాము అంగీకరించాక మాట మార్చారని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తానని చెప్పి చివరకు గన్పార్క్కు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.
సవాళ్లు విసిరే ముందు వాటిని నిలబెట్టుకునే ధైర్యం ఉండాలని అన్నారు. గన్పార్క్కు వెళుతున్న మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వానికి ఏ అంశంపైనా బహిరంగ చర్చ చేపట్టే ధైర్యం లేదని ఆరోపించారు. హరీశ్రావు సహా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందే అన్ని వాస్తవాలు చెప్పాలని భావించినా ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు.
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు గన్పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తన సవాల్ కేటీఆర్, హరీశ్రావులకు కాదని తెలిపారు. నేరుగా కేసీఆర్కేనని స్పష్టం చేశారు. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.
