- మహారాష్ట్రలో ఘోరం..
- వీడియో రికార్డ్ చేసి మరీ ప్రాణత్యాగం..
మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాకు చెందిన సుశీల్ ధాగే (18) జూన్ 21న నిర్వహించిన నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్కు హాజరయ్యాడు. గతంలో మే 3న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో, మళ్లీ పరీక్ష నిర్వహించారు. దీంతో రెండోసారి కూడా సుశీల్ పరీక్షకు హాజరయ్యాడు. ఆత్మహత్యకు ముందు సుశీల్ తన మొబైల్ ఫోన్లో 33 సెకన్ల నిడివి గల వీడియోను రికార్డ్ చేసి కుటుంబ సభ్యులకు పంపించాడు. ఆ వీడియోలో తల్లికి క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వీడియోలో.. ‘అమ్మా.. నేను ఈరోజు చనిపోతున్నాను. నువ్వు బాధపడకు. వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపునే పుడతాను. నీకు ఇలాంటి బాధ మళ్లీ కలిగించను.
నన్ను క్షమించు అమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు. నా గురించి ఆందోళన చెందకు. నేను చాలా బాధలో ఉన్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అని కన్నీటి పర్యంతమవుతూ వీడియోలో చెప్పాడు. ఈ వీడియోను కుటుంబ సభ్యులకు పంపిన కొద్దిసేపటికే సుశీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష మే 3న జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో మే 12న పరీక్షను రద్దు చేశారు. ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది.
లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణేకు చెందిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం జూన్ 21న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించారు. దేశంలో అత్యంత పోటీ పరీక్షల్లో ఒకటైన నీట్కు ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారు. సుమారు లక్ష మెడికల్ సీట్ల కోసం మిలియన్ల మంది పోటీపడుతుండటంతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడుతోంది. తాజా ఘటన మరోసారి విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పరీక్షల ఒత్తిడి, పోటీ విద్యా వ్యవస్థపై చర్చకు దారితీసింది.
