- కనుమరుగవుతున్న ఫుట్పాతులు కనిపించని ఆపరేషన్ రోప్
- వ్యాపారుల గుప్పిట్లో బందీలుగా మారిన ఫుట్పాత్లు
- రోడ్డుపైనే పాదచారుల నడక,ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
- చలానాలకే పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు?
- వ్యాపారుల ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్ల బెంబేలు
- నడక మార్గం మాయం.. ట్రాఫిక్ జామ్లతో సతమతం
- బస్టాపుల్లో తిస్టవేసిన పండ్లు కొబ్బరి బొండాల వ్యాపారులు
నగరవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ రోప్ ద్వారా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించడంతో కొంతకాలం ఉపశమనం పొందిన ప్రజలు, ప్రస్తుతం మళ్లీ అదే సమస్యను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, సీతాఫల్మండి, వారాసిగూడ, పద్మారావు నగర్ ప్రాంతాల్లో ఫుట్పాత్లు తిరిగి ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై పండ్లు,కొబ్బరి బోండాలు,కూరగాయలు,ఫుడ్ స్టాల్స్ తదితర వ్యాపారాలు ఫుట్పాత్లను ఆక్రమించి నిర్వహించడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.దీంతో ప్రమాదాల ముప్పు పెరగడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తీవ్రతరం అవుతోంది.మెట్టుగూడ జంక్షన్,రైల్వే హాస్పిటల్, లాలాగూడ న్యూ బ్రిడ్జ్,శాంతినగర్,చిలకలగూడ గ్రౌండ్,ఆలుగడ్డ బావి బ్రిడ్జ్,సీతాఫల్మండి చౌరస్తా,పద్మారావు నగర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు అధికంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల ఫోటోలు తీసి చలానాలు విధించడానికే పరిమితమవుతున్నారని,ఇప్పుడున్న అధికారులు సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుట్పాతుల ఆక్రమణలు ట్రాఫిక్ జామ్ లను పట్టించుకోవడంలేదని గతంలో ఫుట్ పాత్ ఆక్రమణదారులపై ట్రాఫిక్ జాంకు విఘాతం కలిగించే చిరు వ్యాపారుల ఫుట్పాత్ ఆక్రమణలను కట్టడి చేసేవారని స్థానికులు చెబుతుండడం ఘమనార్ధం.ఫుట్పాత్ ఆక్రమణల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక నాయకుల అండదండలతో కొందరు వ్యాపారులు రోడ్డుపై వాహనాలు,తోపుడు బండ్లు నిలిపి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆపరేషన్ రోప్ను మళ్లీ కట్టుదిట్టంగా అమలు చేసి ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పాదచారులకు సురక్షిత నడక మార్గం కల్పించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
