- స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం..
- పంచ నారసింహ ఆలయాల్లో ఒకటి..
తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన దేవాలయాలు కోకొల్లలు. ఆయన కొలువై ఉన్న ఆలయాలల్లో దేని ప్రాశస్త్యం దానిదే. ప్రతిదీ ప్రత్యేకమైనదే. వాటిలో మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామి ఆలయం ఒకటి. యముడే స్వయంగా ప్రదక్షిణలు చేసిన క్షేత్రం ఇది. ఇక పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహిమాన్వితమైన ఆలయంలో స్వామి స్వయంభువుగా వెలిశాడు. అంతేకాకుండా కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఈ నేపథ్యంలో మట్టపల్లి ఆలయ చరిత్ర, విశిష్టత, ఎలా చేరుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కృష్ణానది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి ప్రహ్లాద యోగానంద నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. యమధర్మరాజు స్వయంగా ప్రదక్షిణలు చేసిన యమమోహిత క్షేత్రంగానూ ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
స్థల పురాణం: పూర్వం రోజుల్లో కృష్ణానది తీరంలోని తంగెడ రాజ్యాన్ని అనుముల మాచిరెడ్డి అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఒకానొక సమయంలో ఆ రాజుకు స్వామి కలలో కనిపించి నదీతీరంలో ఉన్న అడవిలోని ఓ గుహలో తన ఉనికిని తెలియజేశాడు. దీంతో ఆ మరుసటి రోజు రాజు అడవిలోని గుహలు మొత్తం వెతికినా స్వామి జాడ తెలియలేదు.
పైగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఆ విచారంలోనే ఓ చెట్టునీడన సేదతీరుతున్న సమయంలో మళ్లీ స్వప్నం వచ్చింది. ఆ కలలో స్వామివారి మరోసారి కనిపించి సమీపంలో ఉన్న ఆరె చెట్టు మీద గరుడ పక్షి ఉంటుందని, అదే దారి చూపిస్తుందని చెప్పాడట. ఆ ప్రకారంగా వెళ్లిన రాజు గుహను వెతికి, శుభ్రం చేయగా… దక్షిణావృత శంఖంతో ఓ రాయిపైన స్వామి ఆకారం కనిపించిందట. ఇక స్వామి స్వయంభుగా వెలవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించాడనేది పురాణకథ.
