ఆదాబ్ హైదరాబాద్ ఎండీ వీరమల్ల సత్యంకు సిట్ నోటీసులు
- జూన్ 1న విచారణకు హాజరుకావాలని ఆదేశం
- బీఆరఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆదాబ్
- వీరమల్ల సత్యంపై అప్పట్లో కేసులు నమోదు
- ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో కొత్త పరిణామం
- ట్యాపింగ్ కేసులో మీడియా కోణంపై ఫోకస్
- ఎండీ వాంగ్మూలం నమోదు చేయనున్న సిట్
రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రముఖ తెలుగుదిన ఆదాబ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ వీరమల్ల సత్యంకు నోటీసులు జారీ చేసింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు సూచించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులుగా గుర్తించిన పలువురి వివరాలను సేకరిస్తున్న దర్యాప్తు అధికారులు, గతంలో వీరమల్ల సత్యం ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై వివరాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విధానాలు, అధికార వర్గాల పనితీరుపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించిన నేపథ్యంలో సత్యం ఫోన్ నిఘాలోకి వెళ్లినట్లు ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. ఇదే సమయంలో ఆయనపై పలు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అవినీతి, అక్రమాలు, భూదందాలు, అధికార దుర్వినియోగాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తెస్తూ ఆదాబ్ హైదరాబాద్ పలు సంచలన కథనాలను ప్రచురించింది.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టారనే ఆరోపణలకు ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు మాజీ పోలీసు అధికారులు, కీలక వ్యక్తులను విచారిస్తున్న సిట్, బాధితుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. ఈ క్రమంలో వీరమల్ల సత్యంకు నోటీసులు జారీ కావడం రాష్ట్ర రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
