- అమెరికా దౌత్య సిబ్బంది తిరిగి వెళ్ళిపోవాలి..
- సాధారణ పౌరులు జాగ్రత్తగా ఉండాలి..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్పై సరికొత్త హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కీవ్ నగరంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది తక్షణమే నగరాన్ని వీడి వెళ్లాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది.
ఈ ఉద్రిక్తతల మధ్య సోమవారం ఒక కీలకమైన దౌత్యపరమైన పరిణామం చోటుచేసుకుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. కీవ్పై మున్ముందు జరగబోయే దాడుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అక్కడ ఉన్న అమెరికా దౌత్య సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించాలని రూబియోకు లావ్రోవ్ సూచించారు. మిలిటరీ, ప్రభుత్వ భవనాలకు సాధారణ పౌరులు కూడా వీలైనంత దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
