- 10 రోజుల్లోనే దొంగల అరెస్ట్… – భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం
మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో ఈ నెల 14,15 తేదీల మధ్య అర్ధరాత్రి ఐదు ఇండ్లలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి చోరీ చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దొంగలు చోరీ చేసిన 109 తులాల 9 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ.19 వేల నగదులో భాగంగా 92.97 తులాల బంగారం, 1.7 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో A1 జాదవ్ శ్రీరామ్ నాయక్, A3 జాదవ్ మాలిబాయి ని అరెస్ట్ చేయగా… మరో ఇద్దరు నిందితులు రాథోడ్ ఇప్పు సింగ్, సాంకి బాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కామారెడ్డి,నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మొత్తం 17కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించామని ఎస్పీ తెలిపారు. మొదట అంతరాష్ట్ర ముఠా అని భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి చీలపల్లి సమీపంలోని హైవే అండర్ పాస్ బ్రిడ్జి క్రింది నుంచి వెళ్లిన ద్విచక్ర వాహనం పై అనుమానం కలిగి బైక్ నెంబర్ ఆధారంగా నిందితుల వివరాలు కనుగొన్నారు.

ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విలువైన బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని చెప్పారు. కేసును వేగంగా ఛేదించినందుకు జిల్లా అదనపు ఎస్పితో పాటు మెదక్ డియస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, రేగోడు ఎస్సై పోచయ్య,పెద్ద శంకరంపేట పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
