- కుకునూరుపల్లిలో కల్తీ బీర్ల కలకలం ప్రాణాలతో చెలగాటం..!
- అడిగితే నిర్వాహకుల ‘దౌర్జన్యం..!
- ఫోన్ ఎత్తని ఎక్సైజ్ సిఐ..?
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున వైన్స్ ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, మద్యం ప్రియుల జేబులు కత్తరిస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బుధవారం రాత్రి వెలుగు చూసిన ‘కింగ్ఫిషర్’ కల్తీ ఉదంతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఒకే బ్రాండ్.. మూడు రంగులు: ఇదా మీ నాణ్యత?
గ్రామానికి చెందిన ఒక యువకుడు బుధవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో మూడు కింగ్ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేయగా, వైన్స్ నిర్వాహకుల అసలు రంగు బయటపడింది. బాటిళ్లలో ద్రవం ఒకదానిలో నిండుగా, మరొకదానిలో సగం.. రంగు చూస్తే ఒకదానికీ మరొకదానికీ సంబంధం లేదు! ఇది తయారీ లోపమా? లేక సీళ్లు తీసి కల్తీ విద్యనా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. సామాన్యుడు రక్తం ధారపోసి సంపాదించిన డబ్బుతో మద్యం కొంటే, మీరు విషాన్ని విక్రయిస్తారా? అని స్థానికులు నిలదీస్తున్నారు.
ఈ అక్రమంపై వివరణ కోరిన బాధితుడికి సదరు వైన్స్ నిర్వాహకుడు ఇచ్చిన సమాధానం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. “మాకేం సంబంధం లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో” అనే ధోరణిలో దురుసుగా ప్రవర్తించారు. అంటే, వెనుక ఏవరో రాజకీయ పెద్దల హస్తం ఉందనే ధీమాతోనే ఈ ‘లిక్విడ్ మాఫియా’ రెచ్చిపోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కుంభకర్ణ నిద్రలో ఎక్సైజ్ శాఖ!
ఇంత జరుగుతున్నా చేర్యాల ఎక్సైజ్ సిఐ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. బాధితుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు పదేపదే ఫోన్ చేసినా, సిఐ ఫోన్ లిఫ్ట్ చేసే సాహసం చేయలేదు, ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక ప్రజల ప్రాణాలు పోతే గాని స్పందించరా వేచి చూడాలి.
